18, డిసెంబర్ 2010, శనివారం

ఆరేళ్లలో అందనంత ఎత్తుకు జగన్

2004లో...
జగన్ వార్షిక ఆదాయం రూ.10 లక్షలు
స్థిరాస్తుల విలువ రూ.36 లక్షలు
వివిధ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు రూ. 19 కోట్లు
2006లో...
జగన్ ఆదాయం రూ.40 కోట్లు
2010లో...
జగన్ కట్టిన అడ్వాన్స్ ట్యాక్స్: రూ.84 కోట్లు

2003-04 సంవత్సరంలో వైఎస్ జగన్ చెల్లించిన ఆదాయపు పన్ను కేవలం రూ.60 వేలు. 2009-10 సంవత్సరంలో ఆయన చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ ఏకంగా రూ.84 కోట్లు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన ఎలా ఎదిగిపోయారో, ఎంతగా చెలరేగిపోయారో చెప్పడానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు. అధికారంలోకి రాక మునుపు ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాల్సినంత ఆర్థిక దుస్థితి వైఎస్‌ది. పీఠం ఎక్కిన తర్వాత ఆయన ఓ మహా ప్రబల ధన శక్తిగా ఎదిగిపోయారు. అంతేకాదు... సీఎం అయిన తొలినాళ్ల నుంచే తన అధికార సోపానాల మీదుగా సుపుత్రుడి ఎదుగుదలకు యథా శక్తి శ్రమించారు. సండూర్ పవర్ అనే అతి చిన్న కంపెనీతో ప్రారంభమైన జగన్ వ్యాపారం... వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక శాఖోపశాఖలుగా విస్తరించింది. కార్మెల్ ఆసియా, జనని ఇన్‌ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, క్లాసిక్ రియాల్టీ, షలోమ్ ఇన్‌ఫ్రా, ఇన్‌స్పైర్ హోటల్స్, సిలికాన్ బిల్డర్స్ ఇలా అనేక కంపెనీలు పుట్టుకొచ్చాయి.
ఈ కంపెనీల పుట్టు పూర్వోత్తరాలపై 'ఆంధ్రజ్యోతి' పక్కా ఆధారాలతో సహా అనేక ప్రత్యేక కథనాలు ప్రచురించింది. అప్పట్లో వైఎస్ చెప్పిందే వేదంగా భావించిన కాంగ్రెస్ నేతలంతా ఈ కథనాలను దునుమాడిన వారే. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు జగన్ కంపెనీల పుట్టుక వెనుక రహస్యం తమకు తెలుసంటూ విమర్శిస్తున్నారు. 'అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?' అంటూ ప్రశ్నిస్తున్నారు.

సండూర్ పవర్‌తో మొదలుపెట్టి... దానికి అనుబంధంగా కొన్ని కంపెనీలు, మరిన్ని పిల్ల కంపెనీలను పుట్టించి, వాణిజ్య నిపుణులకు సైతం అంతుపట్టని రీతిలో జగతి పబ్లికేషన్స్‌లోకి పెట్టుబడులు ప్రవహింప చేశారు. ఈ క్రమంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితులను అడ్డగోలుగా ఉల్లంఘించి... జగతి పబ్లికేషన్స్‌కు మారిషస్ నుంచి అక్రమమార్గంలో డబ్బులు తెప్పించారు. 'మా కంపెనీలో విదేశీ పెట్టుబడులు లేవు' అంటూ ఆర్ఎన్ఐకి తప్పుడు సమాచారం అందించారు. సెబీ నిషేధించిన కంపెనీలకూ జగతి పబ్లికేషన్స్ షేర్లు కేటాయించడం మరో అక్రమార్కం. అంతేకాదు... చరిత్ర మొత్తం అనుమానాస్పదమే అయిన 12 పశ్చిమ బెంగాల్ కంపెనీలు కూడా జగతిలో పెట్టుబడులు పెట్టాయి. అందులోనూ, రూ.9.31 లక్షల సంచిత నష్టం మూటగట్టుకుని, 2007-08లో కేవలం 77,855 రూపాయల లాభం ఆర్జించిన కంపెనీలు... జగతిలో ఏకంగా 41.57 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు చూపించారు. ఇదంతా 'జగన్ మాయ'లో భాగమే! ఇలాంటి అక్రమాల పుత్రికకు ముఖ్యమంత్రి వైఎస్ 'అధికారికంగా' ఆర్థిక పరిపుష్టి కలిగించారు. నిబంధనలు సడలించి మరీ కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలను గుప్పించారు.

అంతా అడ్డగోలు...
వైఎస్ తనయుడు జగన్ ఏర్పాటు చేసిన భారతి సిమెంట్స్ (అప్పట్లో రఘురాం సిమెంట్స్) ఆవిర్భావమే ఒక 'అద్భుతం!' ఈ సంస్థలో ప్రమోటర్ల (జగన్ కుటుంబం) వాటా ఒక్క ఏడాదిలోనే రూ.45 కోట్ల నుంచి రూ.6500 కోట్లకు పెరిగింది. ఇది భారత సిమెంట్ రంగం చరిత్రలోనే ఒక రికార్డు. ఇక జగన్ కంపెనీలకు 'తల్లి లాంటిదైన' సండూర్ పవర్‌ది మరో చరిత్ర! 22 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న ఈ విద్యుత్తు ప్లాంటు విలువ రూ.1300 కోట్లుగా చూపారు. పది రూపాయల షేరును రూ.675కు విక్రయించారు. అందులో 21 లక్షల షేర్లను నిమ్మగడ్డ ప్రసాద్ (మ్యాటిక్స్) కొన్నారు. మరో 82 లక్షల షేర్లను బినామీ కంపెనీలకు విక్రయించి రూ.702 కోట్లు అక్రమంగా సమీకరించారు.
ఆ సొమ్ముతోనే జగన్ బంతాట ఆడటం మొదలుపెట్టారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించడం, అలా పెట్టుబడులు పెట్టిన వారికి ప్రభుత్వపరంగా లబ్ధి చేకూర్చడం వైఎస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.

13, డిసెంబర్ 2010, సోమవారం

మేడిపండు చూడ మేలిమై ఉండు 
పొట్ట విప్పిచూడ పురుగులుండు అన్నట్లుగా… 
అమెరికాస్వామ్య భావన చెవులకు వినసొంపు 
పాలకుల చేతలు చూడ ఒట్టి నియంతృత్వపు కంపు 
వికీలీక్స్‌ వెబ్‌ నిర్వాహకుడు జూలియన్‌ అసాంజేను ఎట్టకేలకు సామ్రాజ్యవాదులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను లండన్‌ పోలీసులు మంగళవారంనాడే అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయనే లొంగిపోయినట్లు కొన్ని వార్తల సారాంశం. అమెరికా రహస్యాల్ని పత్రాల సహా బట్టబయలు చేయగానే ఆ దేశ పాలకులు మున్నెన్నడూ లేనంతగా గడబిడకు గురయ్యారు. అప్పటి నుంచే అసాంజేను ఈ లోకం నుంచి పంపించేందుకు చీకటి ప్రయత్నాలూ చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అసాంజేను పట్టి మట్టుబెట్టాలని తన అనుంగు దేశాలకు అనధికారికంగా ఆదేశాల్నీ జారీ చేశారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగానే బ్రిటీష్‌ ప్రభుత్వం ఆసాంజేను అదుపులోకి తీసుకుంది. అయితే ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఫిర్యాదు కారణంగానే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పటమే అమెరికా తరహా ప్రజాస్వామ్యం తీరుతెన్నులను పట్టిచూపుతోంది.
అసాంజే తన వికీలీక్స్‌ వెబ్‌సైట్‌లో ఏమయినా తప్పుడు పత్రాలు పెట్టిఉంటే వాటికి వివరణ ఇవ్వొచ్చు. వాస్తవ పత్రాలను లోకానికి చూపి అసాంజే తప్పును ఎరుకపరచవచ్చు. అయితే అదేమీ చేయకుండా ప్రజాస్వామ్యానికే పెద్దన్ననని నిత్యం చెప్పుకునే అమెరికా పాలకులు ఆసాంజేనే శాశ్వతంగా తొలగించే పనికి పూనుకోవటంక్షంతవ్యంకాని నేరం.  ఇది మీడియా స్వేచ్ఛపై కత్తికట్టటమే. మీడియాను బహిరంగంగా ఉరితీయటమే.
అమెరికాకు ఇది ఎంత మాత్రమూ తగదు.
జూలియన్‌ అసాంజేను వెంటనే విడుదల చేయాలి. 

మనోహరుకు ఉరిశిక్ష వద్దన్న ఉన్నత న్యాయస్థానం


అన్నట్లు మనోహర్‌ గుర్తున్నాడా? అదేనండి, ఒంగోలు మనోహర్‌ (వీడు మా ఊరి వాడయినందుకు సిగ్గు పడుతూ).
అది 2004 జూన్‌ 20. ఉదయం వేళ.
టీవీల్లో ప్రసారమయిన ఆ వార్తతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
యువతులు, ప్రత్యేకించి చదువుకుంటున్నవారు వెక్కివెక్కి ఏడ్చారు.
నిమిషానికి 72సార్లు లబ్‌డబ్‌లాడాల్సిన అమ్మాయిలున్న తల్లిదండ్రుల గుండెల వేగం ఎన్నోరెట్లు పెరిగి డబడబలాడాయి.
దేశం పాడయిపోతోందని నిన్నటి తరం వాళ్లంతా గుండెలు బాదుకున్నారు.
ఏదో ఒకటి చేయాలని అభ్యుదయవాదులు ఎవరికివారే ఆలోచనలు చేశారు.
ప్రభుత్వం తనదైన పాత పద్దతిలోనే అమ్మాయిలపై జరిగే అకృత్యాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హామీలతో సరిపెట్టింది.
ఆనాడు, ఆ సమయంలో అసలేమి జరిగింతో గుర్తుచేసుకుందాం.
విజయవాడలోని శారదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ కళాశాల. అది ఎంసిఏ రెండో ఏడాది తరగతి గది. ఆ రోజు తరగతులు ప్రారంభమయిన కాసేపటికే వై మనోహర్‌ వచ్చి తన బెంచీలో కూర్చున్నాడు. అతని ముందు వరుసలో ఎప్పటి మాదిరిగానే శ్రీలక్ష్మి కూర్చుని తదేక దృష్టితో అధ్యాపకుడు చెప్పే పాఠం వింటోంది.
ఆ సమయంలో ఒక్కసారిగా మనోహర్‌ తన వీపు భాగంలో దాచి ఉంచిన పొడవాటి (వెదురు) కత్తిని బయటకు లాగుతూనే ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మి మెడపై నరికాడు. వెంటవెంటనే మరో రెండుసార్లు తలపైనా, మెడపైనా నరికాడు. శ్రీలక్ష్మి అక్కడికక్కడే కూలిపోయింది. మరుక్షణం ప్రాణం విడిచింది. మనోహర్‌ నెమ్మదిగా నడుచుకుంటూ తరగతి గదినీ, కళాశాలనూ వీడి వెళ్లిపోయాడు.
భయం… భయం. అందరూ భయం గుప్పిట్లో చిక్కి అయోమయంలో పడ్డారు.
తరగతి గది నుంచి అధ్యాపకుడు సహా విద్యార్థులు పారిపోయారు. విద్యార్థినుల హాహాకారాలతో కళాశాల దద్దరిల్లింది. ఇంకేముంది… పోలీసుల బూట్ల చప్పుడు. మీడియా గొట్టాల హడావుడి సరేసరి. టీవీల్లో స్క్రోలింగులు, వార్తలు, లైవులు, అభిప్రాయాలు, ఖండనలు, ఉద్రేకాలు.
మనోహర్‌ తొలుత తన బంధువుల ఇంటికి వెళ్లాడు. బట్టలు మార్చుకుని చెన్నయి చెక్కేశాడు.
రెండో రోజు నుంచీ రాష్ట్రవ్యాపితంగా విద్యార్థి, మహిళా సంఘాల ఆందోళన ప్రారంభమయింది. పోలీసుల వేట ఎందుకూ కొరగాకుండా పోయింది.
మనోహర్‌ను పట్టుకుని తామే చంపేస్తామంటూ కొందరు ఆవేశపరులు ప్రతినబూనారు.
పది రోజులు గడచింది.
సమయం అర్ధరాత్రి దాటింది. వీధుల్లో మనుషుల సంచారం పూర్తిగా ఆగిపోయింది. అప్పుడొకటి అప్పుడొకటి వాహనాలు మాత్రం అటూ తిగుగుతున్నాయి. పోలీసులు తమ రోజూవారీ విధుల్లో భాగంగా చెన్నయి వీధుల్లో గస్తీ తిరుగుతుండగా అనుమానాస్పదంగా ఓ యువకుడు కన్పించటం, వాడిని స్టేషనుకు తరలించటం వెంటవెంటనే జరిగాయి. అక్కడ వాడికి పోలీసు ఆతిథ్యం లభించగానే తానెవరో అంతా వివరించాడా యువకుడు. తాను విజయవాడలో శ్రీలక్ష్మిని హత్యచేసిన మనోహర్‌నని నింపాదిగా చెప్పుకున్నాడు.
అదీ అప్పటి విషాధ సంఘటన సంక్షిప్త సమాచారం.
మనోహర్‌కు స్థానిక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. ఎందరెందరో సంతోషం ప్రకటించారు ఒక్క నక్సలైట్లు, వారి సానుభూతి పరులు తప్ప.
అయితే ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. అక్కడ మనోహరుకు మరణశిక్ష తప్పింది. జీవిత ఖైదు ఖాయమయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానినికెక్కింది.
07 డిసెంబరు 2010న సుప్రీం కూడా మనోహరుకు జీవితఖైదు చాలంటూ హైకోర్టు తీర్పునే ఖరారు చేసేసింది

హిల్లరమ్మ హల్లరి హల్లరి

గూగుల్‌ విడుదల చేసే సమాచారం తమ సెన్సారు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని చెప్పినందుకు చైనాను అమెరికన్లు నిరంకుశ, ఇనుపతెరల రాజ్యంగా వర్ణించారు. చైనా వంటి దేశాలపై తాను ప్రధానంగా సెన్సార్‌లేని ఇంటర్నెట్‌ వ్యవస్థ గురించే వత్తిడి తెస్తానని అమెరికా విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్‌ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమె  ప్రభుత్వ శాఖలతో పాటు విశ్వవిద్యాలయాల ద్వారా బెదిరింపులకు దిగారు. పచ్చినిరంకుశ ఉత్తరువులు జారీ చేయిస్తున్నారు. వికీలీక్స్‌ విడుదల చేసిన సమాచారం ప్రభుత్వం ప్రకటించే వరకు రహస్యమేనట. దానిని విద్యార్దులెవరైనా చదివి,   అభిప్రాయాలను వెల్లడిస్తే ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలకు అనర్హులను చేస్తారట. అదే కార్మికులు, ఉద్యోగులైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తారట.
ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు వాటిని చూసినా, చివరకు వాటిగురించి పత్రికల్లో రాసినవి చదివినా, ఇతరులకు పంపినా అది రహస్య జాతీయ భద్రతా సమాచారాన్ని ఉల్లంఘించినట్లేనట. అపర ప్రజాస్వామిక, స్వేచ్ఛా దేశంగా తనకు తాను కితాబులిచ్చుకొనే అమెరికా ఇప్పుడు ప్రపంచం ముందు నిలబడిన తీరిది. దానికి బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, తటస్థ దేశంగా చెప్పుకొనే స్వీడన్‌ వంతపాడుతున్నాయి. ఒకవేళ విదేశాల్లో ఉన్న అమెరికన్‌ సైనికులు పత్రికల్లో వీటి గురించి చదివితే వారిపై కూడా చర్య తీసుకుంటారా? ఎందుకీ అపహాస్యపు ఆదేశాలని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. వికీలీకులను ప్రచురించిన పత్రికలపై చర్యలు తీసుకోవాలంటే గతంలో కోర్టులిచ్చిన తీర్పులు ఆటంకంగా మారతాయని పరిశీలకులప్పుడే తేల్చి చెప్పారు. అయినా వికీలీక్స్‌ పత్రాలను ప్రచురించిన న్యూయార్క్‌ టైమ్స్‌ వంటి పత్రికలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కూడా కొందరు ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఇది అమెరికన్లు నిత్యం ప్రవచించే పత్రికా స్వాతంత్య్రానికే విరుద్ధం.
అమెరికా ప్రభుత్వం నేడు జారీ చేస్తున్న నిరంకుశ ఆదేశాలు, ఉత్తరువులు గతంలో బ్రిటీష్‌  చర్యలను తలపింపజేస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందు  ‘మాలపిల్ల’ వంటి ప్రఖ్యాతనవలను, భూసమస్యను ముందుకు తెచ్చిన  ‘మా భూమి’ నాటకాన్ని బ్రిటీష్‌ సర్కార్‌ ఆనాడు నిషేధించింది. విదేశాల నుంచి ఎవరైనా కమ్యూనిస్టు సాహిత్యాన్ని తెచ్చినా, ఎవరిచేతుల్లో అయినా ఉంటే వారిని అరెస్టు చేసేది. ఇప్పుడు వికీలీక్స్‌ విడుదల చేసిన పత్రాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమెరికా సర్కార్‌ను, దోపిడీ వ్యవస్థను కూలదోసేందుకు ప్రేరేపించినట్లు లేవు. నిజానికి ప్రపంచంలో ఎవరు అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్నారు, ఎవరు అమెరికా కంపెనీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, అలాంటి వారిని ఎలా దెబ్బతీయాలి వంటి దుష్టఆలోచనలు, సలహాలు, పథకాలను సూచిస్తూ ప్రపంచమంతటినుంచి అమెరికన్‌ రాయబారులు, వారి తైనాతీలు సహకరించేవారు పంపిన సమాచార పత్రాలవి. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చడానికి ఇచ్చిన సలహాలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా ఇతర దేశాలకు వ్యతిరేకంగా జరుపుతున్న కుట్రలు, అందుకు ఎవరెవరితో చేతులు కలిపిందీ, ఎలాంటి ప్రలోభాలకు గురిచేసిందీ అనే సమాచారం రాతపూర్వకంగా ఉన్న సాక్ష్యాలవి. అమెరికా, దాని మిత్ర దేశాల అసలు రంగు ప్రపంచానికి తెలిపిన కారణంగానే వికీలీక్స్‌పై అవి మండిపడుతున్నాయి. ఇరాక్‌, ఇరాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌పై జరుపుతున్న దాడుల సమర్థనకు తమ  పౌరులను ఎలా మభ్యపుచ్చుతున్నదీ, అసలు నిజాలేమిటీ అన్న అంశాలు కూడా ఆ పత్రాల్లో ఉన్నాయి. అందుకే అమెరికన్లు వాటిని చదవకూడదని ప్రభుత్వం నిరంకుశ ఆదేశాలు జారీ చేస్తున్నదని వేరే చెప్పనవసరం లేదు.
ప్రభుత్వ తీరుతెన్నులు ఇలా ఉంటే తమకు ఎవరన్నా లెక్కలేదు, ఎవరినైనా, ఏమైనా అంటాం, ఎలాంటి సమాచారాన్నాయినా లోకానికి వెల్లడిస్తాం అని భుజకీర్తులు తగిలించుకున్న ‘ట్విటర్‌, ఫేస్‌బుక్‌’ సంస్థల బండారం కూడా బయట పడింది. వికీలీక్స్‌ వెబ్‌సైట్‌ను దానికి సర్వర్లను సమకూర్చిన అమెజాన్‌పై వత్తిడి తెచ్చి అమెరికా ప్రభుత్వం అడ్డుకుంది. పేపాల్‌, విసా, మాస్టర్‌ కార్డ్‌ వంటి సంస్థల ద్వారా వికీలీక్స్‌కు విరాళాలు, ఇతర రూపాలలో డబ్బు బదలాయింపు జరగకుండా వాటిపై వత్తిడి తెచ్చి నిలుపు చేయించింది. ఇంతకంటే నిరంకుశ, అణచివేత చర్యలేముంటాయి.
అయితే ఎక్కడ ఈ దుర్మార్గాలు జరుగుతాయో అక్కడే ప్రతిఘటన  ఉంటుందన్నట్లుగా వికీలీక్స్‌ను అడ్డుకొనే సంస్థల వెబ్‌సైట్లపై అసాంజే అభిమానుల దాడులు దీనినే సూచిస్తున్నాయి. తనకు నచ్చని ఇతర దేశాల వెబ్‌సైట్లపై ఇలాంటి దాడులు చేయించటంలో అమెరికన్ల తరువాతే ఎవరైనా.  ఇప్పుడు అలాంటి వారికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్నట్లు ప్రతిఘటన ఎదురవుతోంది. అది ఒక ప్రయివేటు సంస్థలకే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటు వాటిపై వత్తిడి తెస్తున్న ప్రభుత్వ సైట్లపై కూడా  హాకర్లు దాడి చేసేందుకు సిద్ధమౌతున్నారు. తన సిఐఏ కనుసన్నలలో పనిచేసే ఒక మహిళతో కండోమ్‌ లేకుండా శృంగారంలో అసాంజే పాల్గొన్నాడనే గడ్డిపోచ కేసును స్వీడన్‌లో దాఖలు చేయించి, బ్రిటన్‌లో అరెస్టు చేయించింది తప్ప, తన కంతలను పూడ్చుకోలేని అమెరికా సర్కార్‌ అతనిపై ఇంతవరకు ప్రత్యక్షంగా ఎలాంటి కేసు నమోదు చేయలేని బలహీన స్థితిలో ఉంది. అమెరికా రాయబార, విదేశాంగశాఖ కార్యాలయాల అధికారులు, సిబ్బంది ప్రమేయం లేకుండా టన్నులకొద్దీ రహస్య పత్రాలను ఒక వ్యక్తిగా అసాంజే బయటకు తీసుకురావటం అసాధ్యమైన అంశం. ఒక వేళ తనను అరెస్టు చేసినా తమ వద్ద ఇంకా ఉన్న పత్రాలను బయటపెడతామని ఆసాంజే చేసిన ప్రకటన నేపథ్యంలో అమెరికా ఇంత నిరంకుశంగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది.