29, అక్టోబర్ 2010, శుక్రవారం

ముదనష్టపు మంత్రులు … ముదురు మాటలు

ముదనష్టపు మంత్రులు … ముదురు మాటలు

గదర్‌ వీరుడు దర్శి చెంచయ్య తన ‘నేను – నా దేశం’ రచనలో అంటారూ, ”దరిద్ర దేశం, దరిద్ర ప్రజలూ” అని.
దానికి నన్ను కొంత జత చేర్చనీయండి- ”దరిద్రానికి కారణం, ముదనష్టపు మంత్రులూ, ముదురు మాటలూ”.
లేకపోతే హేమిటండీ, రాష్ట్ర మంత్రుల గోల. ”వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్‌” అని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి వొట్టట్టి (క్షమించాలి… ఆయన ఇంటి పేరు వొట్టి మాత్రమే నండి) వసంతకుమార్‌నే మహాకవి గురజాడ మందలించి ఉంటాడని నా గట్టి నమ్మకం. 2004కు ముందు ప్రతిపక్షంలో ఉండగా… అవినీతి, అక్రమాలు అంటూ ఆనాటి పాలకపక్షాన్ని తూర్పారబట్టిన ఈ నిత్య వసంతుడు గద్దెనెక్కగానే, పాతంతా రోతన్నట్లుగా వ్యవహరిస్తున్న విషయం ఎవరికి తెలియదంట. తూర్పు గోదావరి జిల్లాలో అసైన్డు భూమిని అరవై ఎకరాలదాకా బొక్కి రొయ్యల్ని పెంచేస్తూ మీసాల్ని మేలేస్తోన్న వొట్టి అయినదానికీ కానిదానికీ ఇప్పుటికీ ఆనాటి పాలకులదే తప్పని తెలివిగా తప్పించుకోజూడటం ఆయన తెలివితక్కువతనానికి నిలువెత్తునిదర్శనం. సూక్ష్మ రుణ సంస్థల మహా దారుణాలను అడ్డుకోలేని ఈ మ(క)0త్రివర్యుడు తప్పంతా పేదోళ్లదేనని సిగ్గులేకుండా వాగేశాడు. సూక్ష్మ రుణ సంస్థల నుంచి పౌడర్ల కోసం, స్నోల కోసం మహిళలు అప్పులు తీసుకుంటున్నారని తేల్చేశాడు. అంటే 19 వేల కోట్ల సొమ్మిచ్చి వడ్డీ వ్యాపారం చేసుకోండని సూక్ష్మ రుణ సంస్థలను భారతదేశం మీదకు తోలిన ప్రపంచబ్యాంకు అసలు నేరస్తురాలు కాదన్నట్లు, అడ్డూఅదుపూ లేకుండా సూక్ష్మరుణ సంస్థలు జనంమీద పడి దోచుకునేందుకు అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానిది అసలు తప్పేలేదన్నట్లు, పేదల్ని మరింత దోచుకుతినేందుకుగాను సూక్ష్మరుణ సంస్థలకు నియమ నిబంధనల్లో వెసులుబాటు కల్పించిన గౌరవనీయ రిజర్వుబ్యాంకు నీతి-నిజాయితీకి మారు పేరన్నట్లుగా, కోటి మంది తెలుగు తల్లుల్ని లక్షాధికారుల్ని చేస్తామని గత ఎన్నికల సందర్భంగా హామీల ఎత్తిపోతల్ని తలకెక్కించిన తానూ, తన గురుతుల్యులు శ్రీమాన్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసలు అసత్యమంటే తెలియని వారేనన్నట్లుగా విచిత్రాతి విచిత్రంగా వొట్టిగారు వొట్టి విస్తర్లేయటం క్షంతవ్యంగాని నేరం. పేదలు పౌడర్లు కొనుక్కోవటం నేరమయితే ముందు వాటిని దేశంలో అమ్మకుండా నిషేధించండి వొట్టిగారూ!. అన్నట్లు అమ్మల్ని లక్షాధికారుల్ని చేసేందుకుగాను మీరు పావలా రుణాలు ఇస్తామని చెప్పారుగదా, మీరు నిజంగా రుణాలు ఇచ్చి ఉంటే అప్పుడు పేదలు పౌడర్లు కొని ఉండేవారు కాదా? కాదంటే ఇప్పుడు ఆ పనిని మహిళల చేత ఎందుకు చేయించలేకపోయారు? అవునంటే పౌడర్లు, స్నోలు కొనే మహిళల్ని మీరు ఏ విధంగా లక్షాధికారులుగా చేసేవాళ్లు? నిజమేంటో కాస్త చెప్పి పేద్ద పుణ్యం కట్టుకోండి సార్‌.
సూక్ష్మరుణం పుణ్యమా అని అశువులుబాసిన ముప్పైమంది నేపథ్యాలను పరికించినా వొట్టి మాటలు వొట్టట్టి నోటి దూల మాత్రమేనని ఇట్టే తేలిపోతుంది. ఇందిరమ్మ ఇల్లని పేదోళ్లని మీరు వీధిలో పారేస్తే, మొండి గోడలకు కాసింత కప్పేసుకునేందుకుగాను మహిళలు సూక్ష్మరుణాల్ని తీసుకున్నారు. బియ్యం ముప్పై, నలభై అమ్ముతుంటే బతకలేనోళ్లు ఆటో ఏసుకుందామని సూక్ష్మ సంస్థల్ని నమ్మారు. కుంట, సెంటు భూమిలో నాట్లేసేందుకు సూక్ష్మరుణాలు తీసుకున్నారు. ఎక్కడో, ఎప్పుడో- ఒకరో, ఇద్దరో తప్పుదోవ పడితే పట్టి ఉండొచ్చుగాక, అదే విశ్వజనీన సత్యమంటూ దొడ్డిదారిన నడుస్తోన్న కంత్రీలు ముందూ వెనుకా చూడకుండా వాగేయటం వొట్టట్టిలకే సరిపోతుంది.
అయినా దొరికినంత దోచుకోవటం, పీక్కోవటం తప్ప ఈ ప్రభుత్యం చేస్తోంది ఏమీ లేదని తేలిపోయింది. దాన్లోనే పడి మంత్రులూ, కంత్రులు కొట్టుకు చావొచ్చు. మనందరికీ మండినప్పుడు ఆ మంటల్లో పడి శలభాల్లా మాడి మసవుతారు ఎటూ. కానీ ఊరుకుంటేగా, తగుదునమ్మా అంటూ ప్రతి దాంట్లోనూ వేలు పెట్టి చేతుల్నే కత్తెరేయించుకోవటం మంత్రగాళ్లకు మామూలయింది.
ఉత్తరాంధ్రను భోంచేస్తోన్న బొత్స, రాయలసీమను రసంలా లాగించేస్తోన్న రఘువీరా, తెలంగాణను తెగమేసేస్తోన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా అందరూ, ఒక్కొక్కడు మహా మోసగాళ్లు. అంతర్జాతీయ మోసగాళ్లు సైతం వీళ్ల ముందు ఎందుకూ కొరగారు. ఎవడన్నా పోటీలు పెడితే ఒకటి నుంచి వందదాకా బహుమతులన్నీ మన కంత్రీగాళ్లే కొట్టేస్తారంటే అతిశయోక్తి లేనేలేదు.
గిన్నీస్‌బుక్‌ నిర్వాహకులు తమ దృష్టిని ఒక్కసారి మహామోసగాళ్లపై సారిస్తే ఒకే రాష్ట్రానికి చెందిన ఇంత మంది పేర్లను ఒకేదఫా నమోదు చేయలేక సతమతం కావాల్సిందే.
పోనీలే పాపం, ఆ విదేశీ పుస్తక నిర్వాహకుల పట్ల ఒకింత జాలితో వదిలేద్దాం. మన లింకా బుక్‌ఆప్‌ రికార్డ్స్‌లోనన్నా మనోళ్ల పేర్లనీ, వాళ్ల దొంగ మొహాల్నీ కచ్చితంగా ఎక్కించాల్సిందేనని డిమాండు చేద్దాం

‘వంశధార’ అక్రమార్కులకు క్లీన్‌చిట్‌ … మరి రూ. 20 కోట్లు ఎటు పోయినట్లో?

‘వంశధార’ అక్రమార్కులకు క్లీన్‌చిట్‌ … మరి రూ. 20 కోట్లు ఎటు పోయినట్లో?


శ్రీకాకుళం జిల్లా వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రూ.20 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర నిఘా విభాగం నివేదిక బుట్టదాఖలవనుంది. అవినీతి పరులని ప్రాథమికంగా తేలటంతో సస్పెండు చేసిన అధికారులకు ఇప్పుడు క్లీన్‌చిట్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. 2006-07లో వంశధారకు రూ.62.08 కోట్లు వినియోగించి మరమ్మతులు చేశారు. ఈ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు రావటంతో నిఘా విభాగం దర్యాప్తు జరిపింది. దానికి సంబంధించిన నివేదికను గత ఏడాది మార్చిలో ప్రభుత్వానికి అందించారు. అక్రమాలకు అప్పటి వంశధార ప్రాజెక్టు ఎస్‌ఇ, ఇఇ, డిఇ తదితర 33 మంది ఇంజినీర్లు బాధ్యులని నిఘా విభాగం నిర్ధారించింది. స్వాహాచేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలనీ, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని నిఘా విభాగం స్పష్టంగా పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులందరినీ సస్పెండు చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత సంఖ్యలో ఇంజనీర్లను ఒకేదఫా సస్పెండు చేయటం అదే తొలిసారి. దీంతో గుత్తేదార్లు, ఇంజినీర్లు ఎవరి దోవలో వారు పైరవీలు మొదలెట్టారు. ూద్యోగుల సమస్యల్ని పరిశీలించే విభాగానికి ఫిర్యాదు చేశారు. హైకోర్టును ఆశ్రయించారు. అయినా వారికి వ్యతిరేకంగానే తీర్పులు వెలువెడ్డాయి. చివరికి ఆ నివేదికను మంత్రులు పొన్నాల, ధర్మాన తదితరులు కలిసి ముఖ్యమంత్రి రోశయ్య ముందు పెట్టారు. దీంతో కనీసం తూతూ మంత్రంగానయినా తిరిగి దర్యాప్తు జరిపించి కొందరికైనా క్లీన్‌చిట్‌ ఇస్తే మినహా సస్పెన్షన్లను ఎత్తివేయలేమని ప్రభుత్వం తేల్చుకుంది. ూత్తరాంధ్ర ప్రాజెక్టుల సలహాదారు రౌతు సత్యనారాయణను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం ూత్తర్వులు జారీ చేసింది. సస్పెండైన 33 మంది ఇంజనీర్లలో, 12 మందికి అవినీతి వ్యవహారాల్లో ఎటువంటి సంబంధమూ లేదని నిర్దారిస్తూ సత్యనారాయణ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ మేరకు 12 మందినీ గత ఏప్రిల్‌లో తిరిగి ూద్యోగాల్లో నియమించారు. మిగిలిన 21 మందికీ ప్రభుత్వం దారిమళ్లిన సొమ్మను తిరిగి చెల్లించాలని తాఖీదులు జారీ చేసింది. అక్రమార్కులలో ఒకరు మృతిచెందగా, ముగ్గురు ఉద్యోగ విరమణ చేశారు. నిబంధనల ప్రకారం జీతంలో మూడోవంతుకు మించి జమచేసుకునేందుకు అవకాశం లేదు. సస్పెన్షను కాలంలో ఉద్యోగికి దక్కేది మూడో వంతు జీతమే. అందువలన దారిమళ్లిన సొమ్మును వసూలు చేయాలంటే ఆ ఉద్యోగికి పూర్తి జీతం అందాలి. ఆ మిషతో అక్రమార్కుల సస్సెన్షనును ప్రభుత్వం ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయల మూటలు చేతులు మారినట్లు విమర్శలు విన్పిస్తున్నాయి.

రాజధాని నడుబొడ్డున తెలుగుతల్లి హత్య!

రాజధాని నడుబొడ్డున తెలుగుతల్లి హత్య


నిందితుడు ముఖ్యమంత్రి రోశయ్య 
రాష్ట్ర మంతటా నిరసనలు … పట్టించుకోని ప్రభుత్వం 
(హైదరాబాదు, తెలుగిల్లు ప్రత్యేక ప్రతనిధి) 
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాష్ట్ర రాజధాని నడిబొడ్డున తెలుగుతల్లిని నిలువునా హత్యచేశాడు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్లు విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగుతల్లిని ఖూనీ చేసేందుకుగాను కాంగ్రెసు నాయకుడు టి సుబ్బిరామిరెడ్డి రూ 10 కోట్ల విలువయిన కరకు కత్తిని అందించాడు.
1990లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రత్యేక శ్రద్ధపెట్టి రాష్ట్ర శాసనసభకు సమీపంలో ఏర్పాటు చేయించిన తెలుగు లలిత కళాతోరణాన్ని నామరూపాలు లేకుండా చరిత్రలో కలిపేందుకుగాను దానిని సుబ్బిరామిరెడ్డికి ధారాదత్తం చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారంనాడు ఉత్తర్వును విడుదల చేసింది. సుబ్బిరామిరెడ్డి అందజేసే రూ. 10 కోట్ల నిధులతో పాత లలిత కళాతోరణాన్ని మట్టిలో కలిపి దానికి కొత్త రూపం ఇస్తారు. దాంతో తెలుగు పదానికి స్వస్తి పలుకుతారు. దాని స్థానంలో రాజీవుడి పేరు చేరుతుంది. ఆ తర్వాత సుబ్బిరామిరెడ్డి కోరుకునే వందలాది కోట్ల విలువయిన గుత్తపని ఏదో ఆయనకు దక్కుతుంది. దాన్ని ముక్కల ముక్కల లెక్కన అమ్ముకుంటే ప్రతి వంద కోట్ల రూపాయల విలువయిన పనికి కనీసం పది కోట్ల రూపాయలు  చమటోడ్చకుండానే ఆయన బ్యాంకు ఖాతాలో ముందే జమపడతాయి. ఇది ఎన్నాళ్లుగానో అతి సాధారణంగా జరిగిపోతోన్న తీరు. అయితే ఇప్పటిదాకా అలాంటి చీకటి వ్యవహారాలకు గాంధీతాత బొమ్మలు చేతులు మారేవి. ఇప్పుడు తెలుగుతల్లిని నిలువునా ఘూనీ చేసేందుకు కాంగ్రెసు నేతలు తెగబడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య   మహా పాపపంకిలుడయ్యాడు. అతి పెద్ద నేరస్తుడయ్యాడు.
రాష్ట్రంలో ప్రభుత్వం లేదు లేదంటుంటే, ఉందనిపించుకోవాలనుకున్నాడో? ఏమోగానీ? కొణిజేటి రోశయ్య తెలుగుతల్లిని నిలువునా హత్య చేయటం క్షమించరాని నేరం, ఘోరం.
తెలుగుకూ రాజీవుగాంధీకి ఏమన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా సంబంధం ఉందా?
కనీసం తెలుగు లలిత కళాతోరణం అనేది ఒకటుందని రాజీవుగాంధీకి తెలుసా?
తెలుగు లలిత కళాతోరణం రూపు రేఖల్ని మార్చవలసిన అవసరం ఏమొచ్చింది?
మార్చవలసి వస్తే పది కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా?
ఊరూ, పేరు లేనివాడు వోక్స్‌వ్యాగిన్‌ నాదంటే వాడికి అలవోకగా రూ. 11 కోట్లు విసిరేసిన బొత్స ఈ ప్రభుత్వ ప్రతినిధే కదా? అతనిని అడిగితే ఆ డబ్బేదో పారేయడా?
లేదూ కాదూ అనుకుంటే తెలుగు పదాన్ని తీసేయకుండానే అవసరమయిన నిర్మాణ మార్పులకు పరిమితమయ్యే విధంగా రూ. 10 కోట్లు కాదు, వంద కోట్ల రూపాయల్ని ఒక్కరోజులో పోగేసే సత్తా లేదా మనకు?
అయినా, బహిరంగ వేదికను మూతేసి తైతక్కలాడాలన్న కోరిక ఎవరికి? ఎందుకు కలిగింది?
హైదరాబాదు నడిబొడ్డులో కనీస వసతులున్న ఒకే ఒక బహిరంగ వేదికను ఎందుకు మార్చాలో తెలుగు ప్రజలకు చెప్పి ఒప్పించగలరా?
మూతేసిన శీతల వేదిక కావాలనుకుంటే ఇంకొకటి నిర్మించుకోవచ్చుగదా?
ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రోశయ్యగానీ, కళా(రా)బంధు సుబ్బిరామిరెడ్డిగానీ సమాధానం చెప్పగలరా?
మీకు రాజీవుగాంధీ తీట ఇంకా తీరకపోతే మీ ఇంటి పేరును, మీ పేరును కూడా మార్చుకోండి. ఎవడికీ ఏ అభ్యంతరమూ ఉండదుకాక ఉండదు.
లేదా ఎందుకూ కొరగాని శాసనసభకు తగిలించుకోండి. అదీ చాలదనుకుంటే మీ ముఖాలకు సున్నం కొట్టించుకుని దానిపైన రంగురంగుల్లో రాయించుకుని ఊరేగండి. ఎవడు కాదంటాడు. కానీ తెలుగుతల్లిని నిలువునా ఖూనీ చేయబూనుకుంటే మీకు బడితె పూజ తప్పదు.
తెలుగు సమాజాన్ని అవమానించటం, తెలుగు భాషను నిలువు లోతున పాతేయబూనుకోవటం, తెలుగు పేర్ల స్ధానంలో రోతగాళ్లను చేర్చి తెలుగు భూమిని రోతపట్టించే పనికి పూనుకుంటే మాత్రం మీకు నూకలు చెల్లిస్తాం.
జై తెలుగు తల్లి! జైజై తెలుగు తల్లి.!! 
నమో తెలుగుతల్లి ! నమో నమో తెనుగు తల్లి.!! 
తెలుగోళ్లంతా స్పందించాలి! తెలుగు వాడి- వేడి చూపించాలి మరి!