29, అక్టోబర్ 2010, శుక్రవారం

రాజధాని నడుబొడ్డున తెలుగుతల్లి హత్య!

రాజధాని నడుబొడ్డున తెలుగుతల్లి హత్య


నిందితుడు ముఖ్యమంత్రి రోశయ్య 
రాష్ట్ర మంతటా నిరసనలు … పట్టించుకోని ప్రభుత్వం 
(హైదరాబాదు, తెలుగిల్లు ప్రత్యేక ప్రతనిధి) 
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య రాష్ట్ర రాజధాని నడిబొడ్డున తెలుగుతల్లిని నిలువునా హత్యచేశాడు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ హత్యకు ప్రణాళిక వేసుకున్నట్లు విమర్శలు విన్పిస్తున్నాయి. తెలుగుతల్లిని ఖూనీ చేసేందుకుగాను కాంగ్రెసు నాయకుడు టి సుబ్బిరామిరెడ్డి రూ 10 కోట్ల విలువయిన కరకు కత్తిని అందించాడు.
1990లో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రత్యేక శ్రద్ధపెట్టి రాష్ట్ర శాసనసభకు సమీపంలో ఏర్పాటు చేయించిన తెలుగు లలిత కళాతోరణాన్ని నామరూపాలు లేకుండా చరిత్రలో కలిపేందుకుగాను దానిని సుబ్బిరామిరెడ్డికి ధారాదత్తం చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారంనాడు ఉత్తర్వును విడుదల చేసింది. సుబ్బిరామిరెడ్డి అందజేసే రూ. 10 కోట్ల నిధులతో పాత లలిత కళాతోరణాన్ని మట్టిలో కలిపి దానికి కొత్త రూపం ఇస్తారు. దాంతో తెలుగు పదానికి స్వస్తి పలుకుతారు. దాని స్థానంలో రాజీవుడి పేరు చేరుతుంది. ఆ తర్వాత సుబ్బిరామిరెడ్డి కోరుకునే వందలాది కోట్ల విలువయిన గుత్తపని ఏదో ఆయనకు దక్కుతుంది. దాన్ని ముక్కల ముక్కల లెక్కన అమ్ముకుంటే ప్రతి వంద కోట్ల రూపాయల విలువయిన పనికి కనీసం పది కోట్ల రూపాయలు  చమటోడ్చకుండానే ఆయన బ్యాంకు ఖాతాలో ముందే జమపడతాయి. ఇది ఎన్నాళ్లుగానో అతి సాధారణంగా జరిగిపోతోన్న తీరు. అయితే ఇప్పటిదాకా అలాంటి చీకటి వ్యవహారాలకు గాంధీతాత బొమ్మలు చేతులు మారేవి. ఇప్పుడు తెలుగుతల్లిని నిలువునా ఘూనీ చేసేందుకు కాంగ్రెసు నేతలు తెగబడ్డారు. ముఖ్యమంత్రి రోశయ్య   మహా పాపపంకిలుడయ్యాడు. అతి పెద్ద నేరస్తుడయ్యాడు.
రాష్ట్రంలో ప్రభుత్వం లేదు లేదంటుంటే, ఉందనిపించుకోవాలనుకున్నాడో? ఏమోగానీ? కొణిజేటి రోశయ్య తెలుగుతల్లిని నిలువునా హత్య చేయటం క్షమించరాని నేరం, ఘోరం.
తెలుగుకూ రాజీవుగాంధీకి ఏమన్నా, ఎప్పుడన్నా, ఎక్కడన్నా సంబంధం ఉందా?
కనీసం తెలుగు లలిత కళాతోరణం అనేది ఒకటుందని రాజీవుగాంధీకి తెలుసా?
తెలుగు లలిత కళాతోరణం రూపు రేఖల్ని మార్చవలసిన అవసరం ఏమొచ్చింది?
మార్చవలసి వస్తే పది కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవా?
ఊరూ, పేరు లేనివాడు వోక్స్‌వ్యాగిన్‌ నాదంటే వాడికి అలవోకగా రూ. 11 కోట్లు విసిరేసిన బొత్స ఈ ప్రభుత్వ ప్రతినిధే కదా? అతనిని అడిగితే ఆ డబ్బేదో పారేయడా?
లేదూ కాదూ అనుకుంటే తెలుగు పదాన్ని తీసేయకుండానే అవసరమయిన నిర్మాణ మార్పులకు పరిమితమయ్యే విధంగా రూ. 10 కోట్లు కాదు, వంద కోట్ల రూపాయల్ని ఒక్కరోజులో పోగేసే సత్తా లేదా మనకు?
అయినా, బహిరంగ వేదికను మూతేసి తైతక్కలాడాలన్న కోరిక ఎవరికి? ఎందుకు కలిగింది?
హైదరాబాదు నడిబొడ్డులో కనీస వసతులున్న ఒకే ఒక బహిరంగ వేదికను ఎందుకు మార్చాలో తెలుగు ప్రజలకు చెప్పి ఒప్పించగలరా?
మూతేసిన శీతల వేదిక కావాలనుకుంటే ఇంకొకటి నిర్మించుకోవచ్చుగదా?
ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి రోశయ్యగానీ, కళా(రా)బంధు సుబ్బిరామిరెడ్డిగానీ సమాధానం చెప్పగలరా?
మీకు రాజీవుగాంధీ తీట ఇంకా తీరకపోతే మీ ఇంటి పేరును, మీ పేరును కూడా మార్చుకోండి. ఎవడికీ ఏ అభ్యంతరమూ ఉండదుకాక ఉండదు.
లేదా ఎందుకూ కొరగాని శాసనసభకు తగిలించుకోండి. అదీ చాలదనుకుంటే మీ ముఖాలకు సున్నం కొట్టించుకుని దానిపైన రంగురంగుల్లో రాయించుకుని ఊరేగండి. ఎవడు కాదంటాడు. కానీ తెలుగుతల్లిని నిలువునా ఖూనీ చేయబూనుకుంటే మీకు బడితె పూజ తప్పదు.
తెలుగు సమాజాన్ని అవమానించటం, తెలుగు భాషను నిలువు లోతున పాతేయబూనుకోవటం, తెలుగు పేర్ల స్ధానంలో రోతగాళ్లను చేర్చి తెలుగు భూమిని రోతపట్టించే పనికి పూనుకుంటే మాత్రం మీకు నూకలు చెల్లిస్తాం.
జై తెలుగు తల్లి! జైజై తెలుగు తల్లి.!! 
నమో తెలుగుతల్లి ! నమో నమో తెనుగు తల్లి.!! 
తెలుగోళ్లంతా స్పందించాలి! తెలుగు వాడి- వేడి చూపించాలి మరి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి