28, డిసెంబర్ 2010, మంగళవారం

యూపీఏ బురద - బీజేపీ మౌనం

మొదటి అయిదేళ్లనూ ఏ గొడవా లేకుండా సులభంగా దాటేసిన యూపీఏ... రెండోసారి అధికారంలోకొచ్చిన ఏడాదికల్లా కుంభకోణాల్లో చిక్కుకుంది. కామన్వెల్త్, ఆదర్శ్, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాలు ఒకదాని తర్వాత మరోటి తెరమీదికొచ్చి యూపీఏకు ఊపిరి సలపనీయడం లేదు. వీటన్నిటిలోనూ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం అతి పెద్దది. విధానాలకు వక్రభాష్యం చెప్పి తనకు నచ్చిన కంపెనీలకు 2జీ స్పెక్ట్రమ్ లెసైన్స్లు సంత ర్పణ చేసిన టెలికాం మంత్రి రాజా దేశ ఖజానాకు దాదాపు లక్షా 76 వేల కోట్ల రూపాయల నష్టం తెచ్చారు. కుంభకోణం సాగుతున్న దశలోనే మీడియా దీన్ని వెల్లడించినా యూపీఏ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. తన చర్యలకు ప్రధాని ఆమోదం ఉందని మంత్రి ప్రకటించినా నోరెత్తలేని దయనీయ స్థితిలో మన్మోహన్ ఉండిపోయారు. చివరకు ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు చేపట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నాక, కాగ్ తన నివేదిక ద్వారా బయటపెట్టాక గత్యంతరం లేక డీఎంకేను బతిమాలి రాజాను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఈ కుంభకోణంపై జేపీసీ వేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు శీతాకాల సమావేశాలను పూర్తిగా స్తంభింపజేశాయి.

ఇక కార్గిల్ మృత వీరుల కుటుంబాల కోసం ముంబై లోని కొలాబాలో నిర్మించిన 31 అంతస్తుల ఆదర్శ్ హౌసింగ్ కాంప్లెక్స్లో అవినీతి కొలువుదీరడం మరింత షాకిచ్చింది. 2003లో నిర్మించిన ఈ కాంప్లెక్స్లో ఇప్పటి మార్కెట్ రేటును బట్టి ఒక్కో ఫ్లాట్ విలువ రూ. 6.5 నుంచి 8.5 కోట్ల రూపాయలు. కార్గిల్ అమరవీరుల కోసం కదా అని సైన్యం తన అధీనంలోని స్థలాన్ని సొసైటీకి లీజుకిచ్చింది. తొలుత ఆరంతస్తుల అపార్ట్మెంట్గా ప్రారంభమైన భవంతి అవినీతి రాజకీయ నేతల కన్నుపడేసరికి పెరుగుతూ పోయి వంద మీటర్ల ఎత్తయిన కాంప్లెక్స్గా మారింది. రాజకీయ నాయకులు, ఆర్మీబాస్లు అడ్డగోలుగా ఇందులో ఫ్లాట్లు దక్కించుకున్నారు. ఆర్మీ చీఫ్లుగా పనిచేసిన దీపక్ కపూర్, ఎన్సీ విజ్, నావికాదళ మాజీ వైస్ చీఫ్ శంతను చౌధరిలకు ఇందులో ఫ్లాట్లు ఉన్నాయంటే అందరూ ఆశ్చర్యపోయారు. తీరా బయటపడ్డాక అది కార్గిల్ వీరపత్నుల కోసమని తమకు తెలియదని ఈ పెద్దలు లెంపలేసుకుని వెనక్కి ఇచ్చేశారు. పరువు కాపాడుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ను కాంగ్రెస్ రాజీనామా చేయించింది. విచారణకు కమిషన్నూ ఏర్పాటు చేసింది. 

కామన్వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందే అందులో అవినీతి గుప్పుమని అంతర్జాతీయంగా పరువుతీసింది. కామన్వెల్త్ గ్రామ నిర్మాణం దగ్గర్నుంచి, క్రీడాకారులు ఉపయోగించే చిన్నాచితకా వస్తువుల వరకూ అన్నింటిలోనూ కుంభకోణం జాడలే. ఈ కుంభకోణంలో ఆరోపణలనెదుర్కొన్న భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కల్మాడీ ఇంటిపైనా, ఆయన సన్నిహితుల ఇళ్లపైనా సీబీఐ దాడులు చేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి బాధ్యతల నుంచి కల్మాడీ వైదొలిగారు. చిత్రమేమంటే, ఈ స్కాములన్నింటిలో బీజేపీ పెద్దల పేర్లూ వినబడ్డాయి. కామన్వెల్త్ క్రీడల అవినీతిలో బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్కు అత్యంత సన్నిహితుడు, ఢిల్లీ బీజేపీ నేత సుధాంశు మిట్టల్ పేరు వెల్లడైంది. ఆయన డెరైక్టర్గా ఉన్న సంస్థకు దక్కిన రూ. 230 కోట్ల కాంట్రాక్టులో అవినీతి జరిగిందంటూ ఐటీ దాడులు జరిగాయి. ఆదర్శ్ కాంప్లెక్స్లో ఫ్లాట్ దక్కించుకున్న ఒకరు బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీకి సన్నిహితుడని, నిజానికి అతన్ని బినామీగా పెట్టి గడ్కారీయే దాన్ని పొందారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 

ఇక రాడియా టేపుల్లో బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని దత్త పుత్రిక భర్త రంజన్ భట్టాచార్య నడిపిన వ్యవహారాలూ బయటికొచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్కు అంటిన బురదను ఎత్తిచూపి లబ్ధిపొందేంత స్థితి బీజేపీకి లేకుండా పోయింది. మరోపక్క కర్ణాటకలో బయటపడిన భూకుంభకోణాలు కూడా బీజేపీకి తలవంపులు తెచ్చాయి. కర్ణాటక ఐటీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ఆయన కుమారుడు జగదీష్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమకు చెందని భూమికి కర్ణాటక పారిశ్రామికాభివృద్ధి సంస్థ నుంచి పరిహారం పొందారని ఆరోపణ లొచ్చాయి. దీనిపై సుబ్రమణ్యంనాయుడు రాజీనామా చేయాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తన కుమారులిద్దరికీ సీఎం యడ్యూరప్ప నివాస స్థలాలు కేటాయించడం, షిమోగాలోని నివాసప్రాంతంలో ఓ కుమారుడికున్న 17 ఎకరాల భూమిని వాణిజ్యపరమైన ప్రయోజనాలకు వినియోగించుకునేలా అనుమతించడంలాంటి చర్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. దీనిపై వెనక్కి తగ్గిన యడ్యూరప్ప తన పిల్లల్ని అధికార నివాసం నుంచి పంపించేశారు. అయితే, ఆయనతో రాజీనామా చేయించడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి