18, నవంబర్ 2010, గురువారం

తెనుగు సాహిత్యోద్ధారకుడు సీపీ బ్రౌన్ మహాశయుడు

తెనుగు సాహిత్యోద్ధారకుడు సీపీ బ్రౌన్ మహాశయుడు

నేడు బ్రౌన్‌ 212వ జయంతి
1786 జూన్‌ 13న తెల్లదొరల పిల్లల కోసం ఏర్పాటు చేసిన శరణాలయానికి ఇంగ్లండు నుంచి ఉద్యోగరీత్యా సీపీ బ్రౌన్ తల్లిదండ్రులు మనదేశానికి వచ్చారు. రెవరెండ్‌ డేవిడ్‌ బ్రౌన్‌, కాలే దంపతులకు రెండో కుమారుడు సిపి బ్రౌన్‌. బ్రౌన్‌ 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో డేవిడ్‌ బ్రౌన్‌ మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. వెలగపూడి కోదండరామ దంపతుల వద్ద బ్రౌన్‌ తెలుగు అక్షరాభ్యాసం చేశారు.  1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1821లో రెండు పాఠశాలలు ఏర్పాటు చేశారు. పాఠశా లలో  తెలుగు‌ భాష నేర్పిం చారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు. అక్కడ సైతం తెలుగును అభివృద్ధి చేసేందుకు రెండు పాఠశా లలు ఏర్పాటు చేశారు.  1824లో వెంకటశాస్ర్తి సాయంతో వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువదించిన ఘనత సిపిబ్రౌన్‌కు దక్కింది. అనంతరం 1826లో కడప రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు. నిఘంటువును అచ్చువేసేందుకు బోర్డుకు పంపారు.  బోర్డు ఈ నిఘంటువును అచ్చువేయించడానికి తిరస్కరించింది. అనంతరం 1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్‌ ప్రెస్‌ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను తొలగించింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్‌ లండన్‌ కోర్టు ఆఫ్‌ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని పొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్‌ నిఘంటువులను అమ్ముకుని లండన్‌ వెళ్లి పోయారు. 1841లో చెన్న పట్టణ  పోస్టు మాస్టర్‌ జనరల్‌గా, తరువాత మదరాసు  విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో తన గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు. తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు, 1855లో లండన్‌కు వెళ్లిపోయారు. 1865లో తెలుగు ఆచార్యుడిగా చేరారు. అప్పట్లోనే  చందస్సును అచ్చు వేయించారు.  ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు .