12, అక్టోబర్ 2010, మంగళవారం

శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట

ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించి, దిశానిర్దేశం చేసిన మహాకవి శ్రీశ్రీ. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు. శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృత ప్రజామోదం పొందాడు.

ఆయన రచించిన "కవితా! ఓ కవితా!.." అనే కవిత గురించి శ్రీశ్రీ జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాశారు: "కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది".

మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో సుప్రసిద్ధమైనది.

బాల్యం-విద్యాభ్యాసం

శ్రీశ్రీ గా ప్రఖ్యాతి చెందిన శ్రీరంగం శ్రీనివాస రావు 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ( శ్రీశ్రీ తన ఆత్మకథ "అనంతం" పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను ఏప్రిల్లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 2-1-1910 అని రాయించారని పేర్కొన్నారు) శ్రీరంగం సూర్యనారాయణ గారికి దత్తత వెళ్ళడం వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బి.ఏ. (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.

తనలో కమ్యూనిస్టు భావాలు ఎలా మొదలయ్యాయో, ఎప్పుడు మొదలయ్యాయో తనకే తెలియదని, అసలు తన భావాల్ని కమ్యూనిజం అంటారని కూడా తనకి అంతకు ముందు తెలియదని ఆయన అన్నాడు. 1935 లో విశాఖ లోని మిసెస్‌ ఎవిఎస్‌ కాలేజీ లో డిమాన్స్ట్రేటరు గా చేరాడు. 1938 లో మద్రాసులో ఆంధ్ర ప్రభలో సబ్‌ ఎడిటరు గా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు.

1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చివేసిన పుస్తకం అది.

1947 లో మద్రాసు కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.

1955 సార్వత్రిక ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ, CPI, తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. విజయవాడ దగ్గర హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "రాజా లక్ష్మీ ఫౌండేషను" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడు గా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.

సాహితీ వ్యాసంగం
శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రాంభించాడట. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసి పారేశేవాడు.

1950 లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యం లో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథం తో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్‌ లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయంగా ఇలా రాసాడు.

"..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది."

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతా రామ రాజు సినిమాకు ఆయన రాసిన "తెలుగు వీర లేవరా.." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. ఈ పాటకు గాను ఆయన ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు. రెండవ భార్య సరోజ తో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రిక లో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షిక ను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.

రచనలు
శ్రీశ్రీ రచనల జాబితా ఇక్కడ ఇవ్వబడింది
* ప్రభవ - ప్రచురణ: కవితా సమితి, వైజాగ్ - 1928
* వరం వరం - ప్రచురణ: ప్రతిమా బుక్స్, ఏలూరు - 1946
* సంపంగి తోట - ప్రచురణ: ప్రజా సాహిత్య పరిషత్, తెనాలి - 1947
* మహాప్రస్థానం - ప్రచురణ: నళినీ కుమార్, మచిలీపట్నం - 1950
* మహాప్రస్థానం - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ (20 ముద్రణలు)- 1952-1984 మధ్యకాలంలో
* మహాప్రస్థానం - శ్రీ శ్రీ స్వంత దస్తూరితో, మరియు స్వంత గొంతు ఆడియోతో - లండన్ నుండి - 1981
* అమ్మ - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు సోషలిస్ట్ పబ్లిషర్స్, విజయవాడ - 1952 - 1967
* మేమే - ప్రచురణ: త్రిలింగ పబ్లిషర్స్, విజయవాడ - 1954
* మరో ప్రపంచం - ప్రచురణ: సారధి పబ్లికేషన్స్, సికందరాబాదు - 1954
* రేడియో నాటికలు - ప్రచురణ: అరుణరేఖా పబ్లిషర్స్, నెల్లూరు - 1956
* త్రీ చీర్స్ ఫర్ మాన్ - ప్రచురణ: అభ్యుదయ పబ్లిషర్స్, మద్రాసు - 1956
* చరమ రాత్రి - ప్రచురణ: గుప్తా బ్రదర్స్, వైజాగ్ - 1957
* మానవుడి పాట్లు - ప్రచురణ:విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1958
* సౌదామిని (పురిపండా గేయాలకు ఆంగ్లానువాదం) - ప్రచురణ: అద్దేపల్లి & కో, రాజమండ్రి - 1958
* గురజాడ - ప్రచురణ: మన సాహితి, హైదరాబాదు - 1959
* మూడు యాభైలు - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964
* 1 + 1 = 1 (రేడియో నాటికలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1964-1987
* ఖడ్గసృష్టి - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, విజయవాడ - 1966-1984
* వ్యూలు, రివ్యూలు - ప్రచురణ: ఎమ్.వీ.ఎల్.మినర్వా ప్రెస్, మఛిలీపట్నం - 1969
* శ్రీశ్రీ సాహిత్యం - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ (5 ముద్రణలు) - 1970
* Sri Sri Miscellany - English volumes - ప్రచురణ: షష్టిపూర్తి సన్మాన సంఘం, వైజాగ్ - 1970
* లెనిన్ - ప్రచురణ: ప్రగతి ప్రచురణ, మాస్కో - 1971
* రెక్క విప్పిన రివల్యూషన్ - ప్రచురణ:ఉద్యమ సాహితి, కరీంనగర్ - 1971
* వ్యాస క్రీడలు - ప్రచురణ: నవోదయ పబ్లిషర్స్, విజయవాడ - 1980
* మరో మూడు యాభైలు - ప్రచురణ:ఎమ్.ఎస్.కో, సికందరాబాదు - 1974
* చీనా యానం - ప్రచురణ: స్వాతి పబ్లిషర్స్, విజయవాడ - 1980
* మరోప్రస్థానం - ప్రచురణ: విరసం - 1980
* సిప్రాలి - (అమెరికాలో ఫొటోకాపీ) 1981
* పాడవోయి భారతీయుడా (సినిమా పాటలు)- ప్రచురణ:శ్రీశ్రీ ప్రచురణలు, మద్రాసు - 1983
* శ్రీ శ్రీ వ్యాసాలు - ప్రచురణ: విరసం - 1986
* New Frontiers - ప్రచురణ: విరసం - 1986
* అనంతం (ఆత్మకథ) - ప్రచురణ: విరసం - 1986

శ్రీశ్రీ తన ఆత్మ కథను అనంతం అనే పేరుతో వ్రాశాడు. దీనిలో శ్రీశ్రీ తన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఒడిదుడుకులు వివరించాడు. అతడి సమకాలీన కవులు, రచయితలు, ప్రసిద్ధ వ్యక్తులు మనకు ఈ పుస్తకంలో పరిచయం చేశాడు.

* తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996
* విశాలాంధ్రలో ప్రజారాజ్యం - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999
* ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001
* ఖబర్దార్ సంఘ శత్రువు లారా - ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001

ప్రముఖ సినిమా పాటలు

1. మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)
2. హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు)
3. నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన)
4. తెలుగువీరలేవరా (అల్లూరి సీతారామరాజు)

ఆయన మహాప్రస్థానం సంపుటిలో రాసిన "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.." అనే పంక్తులు ఆ తరవాత "రుద్రవీణ", "ఠాగూర్" లాంటి సినిమాల్లో వాడబడ్డాయి.

శ్రీశ్రీ పలుకులు
చమత్కార సంభాషణల లోను, శ్లేషల ప్రయోగం లోను శ్రీశ్రీ ప్రసిధ్ధి చెందాడు. ఆయన చెణుకులు ఎన్నో వ్యాప్తిలో ఉన్నాయి. మచ్చుకు కొన్ని:
* ఒక నాటిక ఏదైనా రాయమని అడిగిన మిత్రుడితో ఇలా అన్నాడు: "ఏ నాటికైనా రాస్తాను మిత్రమా"
* "వ్యక్తికి బహువచనం శక్తి"
* స్నేహితులతో కలిసి మద్రాసు లో హోటలు కెళ్ళాడు. ఒకాయన అట్టు చెప్తానని అన్నాడు. దానికి శ్రీ శ్రీ "అట్లే కానిండు" అన్నాడు.
* తెలుగు కవిత్రయం గురించి తెలుగు భాషకు కవిత్రయం తిక్కన, వేమన, గురజాడ.
* తెలుగు లిపి గురించి ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో(a,aa,i,ee ఈ విధంగా) తెలుగును నేర్పితే
అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్చితాభిప్రాయం . ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను. * మహాప్రస్థానం కవితాసంపుటి కి చలం గారు పీఠిక రాశారు. దానికి యోగ్యతాపత్రం అని పేరు. శ్రీశ్రీ నిర్వహించిన ప్రజ శీర్షిక లో పిచ్చయ్య అనే పాఠకుడు ఇలా ప్రశ్నించాడు "యోగ్యతా పత్రం చదివితే మహాప్రస్థానం చదవనక్కరలేదని నేను అంటాను, మీరేమంటారు". అతిశయోక్తి అయినా, నిజంగానే అంతటి గుర్తింపు పొందిన పీఠిక అది. అయితే శ్రీశ్రీ ఆ పాఠకుడి ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు: "మీరు సార్ధక నామధేయులంటాను"

శ్రీశ్రీ గురించి ప్రముఖుల పలుకులు
* "మహాప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహా కావ్యం" - పురిపండా అప్పలస్వామి
* "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీ శ్రీ బాధ" - చలం, యోగ్యతా పత్రంలో
* "కొవ్వొత్తిని రెండువైపులా ముట్టించాను. అది శ్రీశ్రీలా వెలిగింది" - పురిపండా అప్పలస్వామి

కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు. విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన స్మారకార్ధం నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి